thesakshi.com : ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ‘‘బలమైన కేంద్రం – బలహీనమైన రాష్ట్రాలు’’ అనే కుట్రపూరితమైన, పనికిమాలిన సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకొన్నదని సీఎం కెసిఆర్ అన్నారు.
ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ..
Watch live! CM Sri KCR delivering #TelanganaFormationDay speech from Public Gardens#JaiTelangana https://t.co/aYUYzxVZs2
— Telangana CMO (@TelanganaCMO) June 2, 2022
అందుకే ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల హక్కుల హననం పరాకాష్టకు చేరుకున్నది.
కూచున్న కొమ్మను నరుక్కున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్ధికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతున్నది.
కేంద్రం విధించే పన్నుల నుంచి రాజ్యాంగ విహితంగా రాష్ట్రాలకు రావల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు ప్రస్తుత కేంద్రప్రభుత్వం పన్నులను సెస్సుల రూపంలోకి మార్చి వసూలు చేస్తున్నది.
రాష్ట్రాల వాటాగా రావాల్సిన లక్షలాది కోట్ల రూపాయలను కేంద్రం నిస్సిగ్గుగా హరిస్తున్న విషయం జగద్విదితం.
ఇది చాలదన్నట్టు రాష్ట్రాల ఆర్ధిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తున్నది.
ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టం నిబంధనలను రాష్ట్రాలు విధిగా పాటించాలని శాసిస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, తను మాత్రం ఏ నియమాలకూ కట్టుబడకుండా విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నది.
రుణాలు, పెట్టుబడి వ్యయాలు ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితులకు లోబడే నిర్వహిస్తూ, ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం వైఖరి గుదిబండలా తయారయింది.
కేంద్రం వెంటనే పునరాలోచించాలని రాష్ట్రాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని, రాష్ట్రాల హక్కుల హననాన్ని ఇకనుంచైనా మానుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను.
కేంద్రానికి తలవొగ్గి రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణలు అమలుచేయక పోవడం వల్ల తెలంగాణ ఏటా ఐదు వేల కోట్ల రూపాయలు సమకూర్చుకొనే అవకాశం కోల్పోయింది.
మొత్తం ఐదేళ్లలో 25 వేల కోట్ల రూపాయలు నష్టపోవలసి వస్తోంది.
ఈ 25 వేల కోట్ల రూపాయల కోసం చూస్తే రైతుల బాయిలకాడ మీటర్లు పెట్టాలి.
రైతుల నుంచి విద్యుత్ చార్జీలు వసూలు చేయాలి.
అది మన విధానం కాదు.
రైతులమీద భారం వేసే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు.
కంఠంలో ప్రాణమున్నంతకాలం రైతాంగానికి నష్టంచేసే విద్యుత్ సంస్కరణలను అంగీకరించేది లేదు.
రాష్ట్ర ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యం.
ఈనాడు దేశానికి ఒక సామూహిక లక్ష్యం లేకుండా పోయింది.
చుక్కాని లేని నావలా గాలివాటుకు కొట్టుకు పోతున్నది.
75 ఏండ్ల స్వతంత్రం తర్వాత ఇంకా మన దేశాన్ని దారిద్ర్యబాధ ఎందుకు పీడిస్తున్నది?
సుసంపన్నమైన వనరులు ఉండి, కష్టంచేసే ప్రజలుండీ వినియోగించుకోలేని అసమర్థతకు బాధ్యులు ఎవరు?
దేశాన్ని నడిపించటంలో వైఫల్యం ఎవరిది ?
విజ్ఞులైన దేశ పౌరులు ఈ విషయాలపైన గంభీరంగా ఆలోచించవలసిన అవసరం ఉంది.
ప్రతి ఐదేళ్లకోసారి జరిగే అధికార మార్పిడి కాదు ముఖ్యం.
అధికార పీఠం మీదికి ఒక కూటమి బదులు మరో కూటమి ఎక్కడం కాదు కావాల్సింది.
దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలి.
దేశానికి నూతన గమ్యాన్ని నిర్వచించాలి. ప్రజల జీవితాల్లో మౌలికమైన పరివర్తన తేవాలి. దేశంలో గుణాత్మక మార్పు రావాలి.
కేంద్రం సహకరించినా, సహకరించకున్నా రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా పూర్తి అండదండలు అందిస్తుందని మరోసారి నేను భరోసా ఇస్తున్నాను.
కుట్రపూరితంగా రాష్ట్రాలను బలహీనపరుస్తున్న కేంద్రం
ప్రపంచ దేశాలు అనేక సంఘర్షణలు, పోరాటాల పర్యవసానంగా రాచరిక, నియంతృత్వ దశలను అధిగమించి ప్రజాస్వామ్య దశకు చేరుకున్నాయి. అత్యధిక దేశాలు ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రక్రియను అవలంబిస్తూ, పార్లమెంటరీ పంథాను ఎంచుకున్నాయి.
పరిణామ క్రమంలో ప్రజాస్వామ్యం పరిణతి చెందేకొద్దీ ఆయా దేశాలు అధికారాలను వికేంద్రీకరిస్తూ ప్రజా సాధికారికతను పెంపొందించాయి.
పౌర సమాజ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేశాయి.
కానీ మన దేశంలో అందుకు విరుద్ధంగా జరిగింది. 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం పరిణతిని పొంది అధికారాల వికేంద్రీకరణ జరగకపోగా, నిరంకుశ పోకడలు పెరిగి అధికారాలు మరింత కేంద్రీకృతమవుతున్నాయి.
విశాలతరం కావల్సిన సమాఖ్య స్ఫూర్తి కుంచించుకు పోతున్నది.
భారత రాజ్యాంగం రాష్ట్రాలకు గణనీయమైన రాజకీయ, శాసనాధికారాలను, పాలనాధికారాలను, స్వయంప్రతిపత్తిని కల్పించింది.
ఇప్పటివరకూ కేంద్రంలో గద్దెనెక్కిన ప్రభుత్వాలన్నీ, రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలుపుతూ రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని కాలరాశాయి.
అధికారాలను నిస్సిగ్గుగా హరించాయి.
భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ కేంద్రం పరిధిలోని అధికారాలనూ, రాష్ట్రాల పరిధిలోని అధికారాలనూ స్పష్టంగా నిర్వచించింది. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే మూడు జాబితాలను నిర్దేశించింది.
దేశాన్ని పాలించిన అన్ని ప్రభుత్వాలూ రాష్ట్ర జాబితాలోని వివిధ అంశాలను క్రమంగా ఉమ్మడి జాబితాలోకి లాగేసుకున్నాయి.
కాలం గడుస్తున్నకొద్దీ ఉమ్మడి జాబితా పెరుగుతున్నది. రాష్ట్ర జాబితా తరుగుతున్నది.
రాజ్యాంగం పేర్కొన్న రాష్ట్రాల స్వయంప్రతిపత్తి నామావశిష్టమైపోతున్నది.
గతంలో కేంద్ర ప్రభుత్వాలే ఏర్పాటు చేసిన సర్కారియా మరియు పూంఛ్ కమిషన్లు రాష్ట్రాల హక్కులను పరిరక్షించేందుకు పలు సూచనలు చేశాయి.
కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలూ ఈ కమిషన్ల నివేదికలను బుట్ట దాఖలు చేశాయి.
ఇప్పటివరకూ దేశాన్ని ఏలిన ఈ ప్రభుత్వాలు అనుసరించిన ధోరణులు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏరకంగానూ మంచి చేయజాలకపోగా, దేశ ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధికి, వికాసానికి తీవ్ర అవరోధాలుగా మారాయి.