thesakshi.com : జగన్ పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువతిని ఫోన్లో వేధిస్తున్నారన్నారు. అండగా ఉన్న యువతి స్నేహితుడు ఆత్మహత్యకు పాల్పడేలా బెదిరించిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన వైసీపీ నేతలే మహిళల్ని వేధిస్తున్నారని విమర్శించారు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం కొత్తపల్లి గ్రామంలో వైసీపీ సర్పంచ్ కన్నం శ్యామ్… ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువతిని ఫోన్లో వేధించాడని ఆయన మండిపడ్డారు.
ఆమెకు అండగా నిలిచిన స్నేహితుడు సుదర్శన్ శ్రీనివాసరావు… ఆత్మహత్యకు పాల్పడేలా పోలీసులతో కలిసి బెదిరించాడని దుయ్యబట్టారు. యువతిని వేధించి ఆమె స్నేహితుడి ఆత్మహత్యకు కారణమైన సర్పంచ్ అతని అనుచరులు ఈ దారుణానికి సహకరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్వీట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.
.@ysjagan పాలనలో గజానికో వైసిపి గాంధారి కొడుకు పుట్టుకొచ్చి మహిళల్ని వేధిస్తున్నాడు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం కొత్తపల్లి గ్రామంలో వైసిపి సర్పంచ్ కన్నం శ్యామ్ బరితెగించి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువతిని ఫోన్లో వేధించాడు.(1/3) pic.twitter.com/gEnoGPioUz
— Lokesh Nara (@naralokesh) April 12, 2022
‘బాధ్యత గల సర్పంచి పదవిలో ఉంటూ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం తగదు’ అంటూ ఓ యువకుడు వాట్సప్లో పెట్టిన స్టేటస్ చివరకు ప్రాణాలు తీసింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా కశింకోట మండలం కొత్తపల్లిలో జరిగింది. ‘కొత్తపల్లికి చెందిన సుదర్శన్ నారాయణ శకుంతల కుమారుడు శ్రీనివాస్(26) ప్రైవేటు ఉద్యోగి.
తాను సన్నిహితంగా ఉంటున్న యువతి పట్ల సర్పంచి కన్నం శ్యామ్ వైకాపా నాయకులు అద్దెపల్లి శ్రీనివాసరావు ఇటీవల అసభ్యంగా ప్రవర్తించారు. ఇదే విషయాన్ని శ్రీనివాస్ తన వాట్సప్ స్టేటస్లో ప్రశ్నించాడు. ఆగ్రహించిన సర్పంచి అనుచరులు ఆదివారం శ్రీనివాస్ను రాళ్లతో కొట్టారు’ అని అనకాపల్లి గ్రామీణ సీఐ జి.శ్రీనివాసరావు వెల్లడించారు.
సోమవారం మధ్యాహ్నం శ్రీనివాస్ తన స్నేహితులకు వాయిస్ మెసేజ్ పంపించాడు. ‘నాకు బతకాలని లేదు. సర్పంచి శ్యామ్ తనను ఇబ్బంది పెట్టారని ఓ అమ్మాయి చెబితే స్టేటస్ పెట్టాను. ఏ తప్పు చేశానని నన్ను కొట్టారు? అధికారం ఉంటే ఏమైనా చేస్తారా? నా చావు తర్వాతైనా నిజానిజాలు బయటకు వస్తాయి’ అంటూ అందులో వాపోయాడు.
మిత్రులు ఇంటి వద్దకు వచ్చి చూడగా అప్పటికే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదుపై సర్పంచి శ్యామ్ శ్రీనివాసరావు కన్నం కిశోర్ వి.శ్రీను ఎస్.సురేష్ ఎస్.ప్రేమ్లపై కేసు నమోదుచేసి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఠాణా వద్ద మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు పరామర్శించారు. నిందితులను శిక్షించాలని శ్రీనివాస్ కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.