thesakshi.com : వైసీపీ ఆలోచనలు ఇపుడు మారుతున్నాయి. మంత్రి వర్గ పునర్ వ్వవస్థీకరణకు ముందు సీనియర్లు పార్టీకి అని జగన్ చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. వారి ప్లేస్ లో కొత్త వారికి చాన్స్ అని ఊదరగొట్టారు. కానీ ఇపుడు మాత్రం టోటల్ సీన్ మారిపోయింది. దానికి కారణం సీనియర్ల వత్తిడే అంటున్నారు. తమను అర్ధాంతరంగా తప్పించడం పైన సీనియర్లు గుర్రుగా ఉన్నారట.
వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలి. తాము గెలవాలి. అపుడు సామాజిక రాజకీయ సమీకారణలు ఎలా ఉంటాయో తెలియదు. అందువల్ల రేపటి కోసం ఈ రోజు పదవిని వదులుకోవడం అన్నది కూడా చాలా మందికి అసలు మింగుడుపడడంలేదు అంటున్నారు.
దాంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలో సరికొత్త రాజకీయ ప్రయోగం చేయాలనుకున్న వైసీపీ అధినాయకుడి ఆశలకు బ్రేకులు పడ్డాయని అంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం బట్టి పార్టీ బాధ్యతలు జగనే ఇక మీదట చూసుకుంటారు. అదే టైమ్ లో సీనియర్లుగా ఉంటూ బలమైన గొంతుని వినిపిస్తున్న కీలక నేతలను తిరిగి క్యాబినేట్లోకి తీసుకుంటారు అని తెలుస్తోంది.
అంటే సీనియర్లను క్యాబినేట్లోకి తిరిగి తీసుకోవడం ద్వారా జగన్ వారి మీద ప్రభుత్వ బాధ్యతలు చాలా వరకూ అప్పగించి తానే పార్టీ బాధ్యతలను భుజనా వేసుకుంటారు అని అంటున్నారు. ఇక మీదట జగన్ జనంలో ఉంటారన్నమాట. పాలనకు ఢోకా లేకుండా సీనియర్లు చూస్తారని తెలుస్తోంది.
అంటే కచ్చితంగా పది నుంచి పన్నెండు మందికి తగ్గకుండా పాత బ్యాచ్ కొత్త క్యాబినేట్ లో కనిపించబోతోంది అన్న మాట. ఫస్ట్ టైమ్ జగన్ ఆలోచనలకు విరుద్ధంగా ఆయన మనసు మార్చుకుని ఇలా చేయాల్సి వస్తోంది అంటున్నారు. ఇక కొత్త క్యాబినేట్లో బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి కురసాల కన్నబాబు కొడాలి నాని పేర్ని నాని అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు ఉంటారని చెబుతున్నారు.
వీరితో పాటు సామాజిక వర్గ సమీకరణల నేపధ్యంలో మరి కొందరు కూడా ఉంటారని అంటున్నారు. అంటే కొత్త వారికి దక్కే బెర్తులు 12 మాత్రమే అని తెలుస్తోంది. అది పూర్తిగా సామాజిక వర్గాలను బేస్ చేసుకుని సోషల్ ఇంజనీరింగ్ కి అనుగుణంగా చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి జగన్ కసరత్తు పూర్తి అయింది. జాబితా రెడీ అయింది అంటున్నారు. లిస్ట్ లో ఎవరు ఉన్నారు అన్నది అధికారికంగా రివీల్ అయ్యేది నేడు అని తెలుస్తోంది. చూడాలి మరి ఆ లిస్ట్ లో ఏ పేర్లు ఉంటాయో.