thesakshi.com : అఫ్గానిస్తాన్లో తాలిబాన్లు మరణ శిక్షలు విధిస్తున్నట్లు వస్తున్న వార్తలు విశ్వసనీయమైనవేనని ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ మిషెల్ బచిలీ అన్నారు.
మహిళలపై ఆంక్షలు, పిల్లలను రిక్రూట్ చేసుకోవడం వంటి ఇతర హక్కుల ఉల్లంఘనలు కూడా జరుగుతున్నాయని ఐరాస మానవ హక్కుల మండలిలో ఆమె చెప్పారు.
2001కి ముందు తాలిబాన్లు అఫ్గానిస్తాన్ను పాలించినప్పుడు షరియా చట్టాలను కఠినంగా అమలు చేశారు.
గత వారం వారు అఫ్గానిస్తాన్ను మళ్లీ తమ అధీనంలోకి తీసుకున్నారు.
అప్పటి నుంచి వారు మహిళలు, బాలికలకు హక్కులు ఉంటాయని, ప్రజలకు వాక్స్వాతంత్ర్యం ఉంటుందని చెబుతూ ఎంతో సంయమనంతో ఉన్నట్లు సానుకూల ఇమేజ్కు ప్రయత్నిస్తున్నారు.
మహిళల హక్కులు అత్యంత కీలకమని, అఫ్గానిస్తాన్లో మానవ హక్కుల పరిరక్షణ కోసం ఒక పర్యవేక్షక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఐరాస సభ్య దేశాలను మిషెల్ కోరారు.
కాగా ఐరాసలో చైనా రాయబారి మాట్లాడుతూ… అఫ్గానిస్తాన్లో హక్కుల ఉల్లంఘనలకు అమెరికా సైన్యం, ఇతర అంతర్జాతీయల బలగాలు కూడా బాధ్యులేనని అన్నారు.
తాలిబాన్లతో ఒప్పందం ప్రకారం, అమెరికా దళాలు ఆగష్టు 31లోపు అఫ్గాన్ నుంచి వెళ్లిపోవాలి. ఈ గడువును మరింత పొడిగించేలా, తరలింపును జాప్యం చేయాలని అమెరికాను దాని మిత్ర దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి.
ఆగస్టు 14 నుంచి అమెరికా సుమారు 50 వేల మందిని తరలించడంలో సహాయపడిందని వైట్ హౌస్ పేర్కొంది.
కాగా అఫ్గానిస్తాన్లో చిక్కుకున్న తమ దేశ పౌరులను తీసుకెళ్లేందుకు వెళ్లిన యుక్రెయిన్ విమానం హైజాక్కు గురయిందని మంగళవారం వార్తలొచ్చాయి.
అయితే, ఆ వార్తలు నిజం కాదని యుక్రెయిన్ విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.
ఈ విమానాన్ని కాబుల్ నుంచి ఇరాన్కు హైజాక్ చేసినట్లు యుక్రెయిన్ విదేశీ వ్యవహారాల శాఖ డిప్యూటీ మంత్రి యెవ్జెనీని తొలుత తెలిపారు.
విమానాన్ని ఆదివారమే హైజాక్ చేశారని.. మంగళవారం దాన్ని ఇరాన్ తీసుకెళ్లారని యుక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్జెనీని ఉటంకిస్తూ రష్యా వార్తాఏజెన్సీ టాస్ చెప్పింది.
కానీ యుక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయ అధికార ప్రతినిధి ఓలె నికోలింకో ఆ వార్తను ఖండించారు. విమానం హైజాక్ నిజం కాదని ప్రకటించారు.
కాబుల్ వెళ్లిన యుక్రెయిన్ విమానాలన్నీ సురక్షితంగా తిరిగొచ్చాయని స్పష్టం చేశారు.
అఫ్గానిస్తాన్లో చిక్కుకున్న యుక్రెయిన్ ప్రజలను సురక్షితంగా తేవడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తమ డిప్యూటీ ఫారిన్ మినిష్టర్ చెప్పారే కానీ హైజాక్ చేశారనడం దానర్థం కాదని స్పష్టం చేశారు.
దీనిపై యుక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.
83 మందితో వచ్చిన మిలటరీ కార్గో విమానం ఒకటి యుక్రెయిన్ రాజధానికి చేరిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఆ విమానం ఆదివారమే కాబుల్ నుంచి యుక్రెయిన్ చేరుకుందని అందులో ఉన్న 83 మందిలో 31 మంది యుక్రెయిన్ పౌరులు ఉన్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.