thesakshi.com : కాంట్రాక్టర్లను బెదిరించిన కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అత్యంత సమీప బంధువైన వైఎస్ కొండారెడ్డిని చక్రాయపేట పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఈయన పులివెందుల నియోజకవర్గ పరిధిలోని చక్రామపేట మండల వైసీపీ ఇన్చార్జ్.
వైఎస్ కుటుంబానికి బంధువైన వైఎస్ కొండారెడ్డి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం పరిధిలోకి వచ్చే చక్రాయపేట మండలం వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. గతంలో వైఎస్ జగన్ పాదయాత్రలో కూడా పాల్గొన్న ఆయన కొంతకాలంగా చక్రాయపేటలో వైసీపీ వ్యవహారాలు చూస్తున్నారు. ఇదే క్రమంలో పులివెందుల-రాయచోటి రహదారి పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డు కాంట్రాక్టు తీసుకున్న కర్నాటక లోని ఎస్ ఆర్ కే కన్ స్ట్రక్షన్స్ సంస్ధ పనులు చేపట్టింది. ఇది కర్నాటకలోని ఓ బీజేపీ నేతకు చెందిన సంస్ధగా చెప్తున్నారు. ఈ సంస్ధ రోడ్డు పనులు చేస్తున్న సమయంలో చక్రాయపేటలో పనులు జరగాలంటే డబ్బులివ్వాలని వైఎస్ కొండారెడ్డి సదరు కాంట్రాక్టర్ ను బెదిరించారు.
వైఎస్ కొండారెడ్డి బెదిరింపులపై కాంట్రాక్టర్ అయిన సదరు బీజేపీ నేత సీఎం జగన్ ను నేరుగా ఆశ్రయించినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్.. చర్యలు తీసుకోవాలని స్ధానిక పోలీసుల్ని ఆదేశించారు. దీంతో కడప పోలీసులు ఇవాళ కొండారెడ్డిని అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొండారెడ్డి కాల్ డేటా పరిశీలించిన పోలీసులకు అతను సదరు కాంట్రాక్టర్ ను బ్లాక్ మెయిలింగ్ చేసినట్లు నిర్ధారించారు. దీంతో ఆయన్ను స్ధానిక కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు పంపారు. కొండారెడ్డిని కడప జైలుకు తరలించారు.
తన పేరు చెప్పి కాంట్రాక్టర్లను బెదించడాన్ని సీఎం జగన్ సీరియస్గా తీసుకున్నారని సమాచారం. వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అదేశించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వైఎస్ కొండారెడ్డిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్టు కడప ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. సమీప బంధువని కూడా లెక్కచేయకుండా కొండారెడ్డిని అరెస్ట్ చేయించడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.